న్యూఢిల్లీ: జర్మనీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఆడి, ఫోక్స్ వ్యాగన్ పై భారత దేశంలో తొలి ఎదురు దెబ్బతగిలింది. ఉద్గార నిబంధనలకు సంబంధించిన ఆరోపణలతో ఈ కంపెనీల పై తొలిసారిగా కేసు నమోదైంది.
నోయిడా నివాసి అయిన అనిల్ జిత్ సింగ్ కంపెనీపైనా, కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారుల పైనా ఫిర్యాదు చేశారు. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర లాంటి ఆరోపణలతో సంస్థపై కేసు నమోదు చేసారు.
కాలుష్య నివారణకు సంబంధించి ఉద్గారాల శాతాన్ని తక్కువగా చూపించే చీటింగ్ డివైసెస్ వాడి తనను మోసం చేశారని ఆరోపిస్తూ అనిల్ జిత్ సింగ్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. తన ఎఫ్ఐఆర్ లో ఫోక్స్ వ్యాగన్, ఆడి ఉన్నతాధికారులతోపాటు, జర్మనీలోని ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాల పైనా కూడా ఆయన కేసు పెట్టారు. ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ రాహిల్ అన్సారీ, ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్, ఆడి ఏజీ చైర్మన్ బ్రామ్ షాట్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
2018 లో తను ఏడు ఆడి కార్లను కొనుగోలు చేసానని, అదే సందర్భంలో ఉద్గార నిబంధనలు కప్పి పుచ్చే చీటింగ్ పరికరాల గురించి చర్చించగా వారు అలాంటిదేమి లేదు అని తనకు కార్లు అమ్మారని తెలిపారు.
కాగా ఇటీవల గ్రీన్ ట్రైబ్యునల్ ఈ కంపెనీ పై 500 కోట్ల జరిమానా విధించినప్పుడు తను ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కంపెనీ తనను మోసం చేసి తన కష్టార్జితాన్ని దోచుకుంది అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.