హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్.ఎస్.సీ విద్యార్థుల ఫలితాలను ఈ నెల 21న (శుక్రవారం) విడుదల చేసేందుకు పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫలితాలకు సంబంధించిన ప్రక్రియను ఈ పాటికే పూర్తి చేసింది. వాటిని మరోసారి పరిశీలించనుంది. అయితే ఆ రోజు కుదరకపోతే 22వ తేదీన విడుదల చేయనుంది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. దీని వల్ల తెలంగాణ రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదవ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంది.
వారికి ఆయా సబ్జెక్టులకు ఎఫ్ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తుంది. ఎఫ్ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది.
విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో సాధించిన మార్కుల ప్రకారం వారికి గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ఖరారు చేసి ప్రకటించనుంది. దీంతో ఈసారి 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలుస్తోంది.