లండన్: ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ మరియు న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ ఇరు జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ప్రారంభంకానున్న టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ను చూడడానికి 4000 మంది ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతిని ఇవ్వాలని హాంప్షైర్ కౌంటీ క్లబ్ నిర్ణయించింది.
ఇంతవరకు కరోనా నేపథ్యంలో ఈ మ్యాచ్కు వీక్షకులకు అనుమతి ఇస్తారా లేదా అన్న సందేహాలు నెలకొన్న నేపథ్యంలో హాంప్షైర్ కౌంటీ అధ్యక్షుడు రాడ్ బ్రన్స్ గ్రోవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ప్రకటన ఆయన ఒక విడుదల చేశారు.
ఈ ప్రతిష్టత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం టికెట్లు రిజర్వ్ చేయగా, మిగిలిన 2000 టికెట్లను క్రికెట్ అభిమానులకు అమ్మకానికి పెట్టనున్నట్లు తెలిపారు. టెస్ట్ క్రికెట్ యొక్క చరిత్రలో తొలి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కావడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల ఈ టికెట్లకు డిమాండ్ పెరిగింది. అయితే, యూకేలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ మ్యాచ్లు వీక్షించేందుకు ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు.