హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఆయన స్వయంగా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్లో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బిజేపీలో సీనియర్ నేతగా ఉన్న తనకు బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత పదవి లభించకపోవడం వల్ల అసంతృప్తిగా ఉన్న ఆయన కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత పథకం సమావేశానికి హాజరవ్వడంతో ఈ వివాదం ఇంకా ముదిరింది. బీజేపీ ఆదేశాలను కాదని మోత్కుపల్లి ఆ సమావేశానికి హాజరు కావడం పట్ల బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన తరువాత మోత్కుపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన దళిత ప్రజాప్రతినిధిగా బీజేపీ పార్టీ తరుఫున సమావేశానికి హాజరవడం తమ పార్టీ గౌరవాన్ని పెంచినట్లయిందని వ్యాక్యానించారు. అలాగే దళిత సాధికారత పథకాన్ని, ముఖ్యమంత్రిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
రాష్ట్రంలో దళితులకు మేలు జరుగుతుందని తెలిసి కూడా ఆ వర్గానికి చెందిన నేతగా తాను హాజరవకపోతే ఎలా అని ఆయన పార్టీని నిలదీశారు. పైగా ఆయన పార్టీ నాయకత్వానికి చెప్పి మరీ వెళ్లానని, ఎక్కడా పార్టీ గీతను దాటలేదని తెలిపారు. కానీ మోత్కుపల్లి కేసీఆర్ను, ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మెచ్చుకోవడం బీజేపీకి మింగుడుపడడంలేదు.