గుర్గావ్: గుర్గావ్ కు దగ్గరలో ఒక చిన్న గుడిసెలో చెలరేగిన మంటలు కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ సదరు మురికివాడ అంతా వ్యాపించేశాయి. దీని వల్ల ఆ మురికి వాడలో ఉన్న 700 గుడిసెలు అన్నీ మంటలకి ఆహుతయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో బస్తీవాసులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించక పోవడం అదృష్టం. అయితే గుడిసెలలో నిత్యావసరాలు, సామగ్రి, దాచుకున్న సొమ్మంతా అగ్గి పాలయ్యాయి. దీంతో ఇప్పుడు వారంతా రోడ్డుపై పడ్డారు. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
హరియాణాలోని గుర్గావ్ సమీపంలో ఉన్న నాథూపుర మురికివాడలో శనివారం తెల్లవారుజామున ఒక గుడిసెలో మంటలు చెలరేగాయి. కాగా వాటిని ఆర్పేలోపు పక్కనే ఉన్న మరో గుడిసెకు, అలానే వరుసగా గుడిసె గుడిసెకు అంటుకుంటూ ఏకంగా 700 గుడిసెలకు మంటలు వ్యాపించాయి.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గుడివాసులు వాటికి దూరంగా వచ్చారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గంటన్నర పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు.