హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్ర ఉన్నన్నాళ్లూ అందులో ముఖ్యంగా వినిపించే పేరు ‘మాయా బజార్’. తెలుగు సినిమాకి దాదాపు ఒక 60 ఏళ్ల క్రితమే చాలా కీర్తిని తీసుకొచ్చిన ఆణిముత్యం మాయా బజార్. ఈ జనరేషన్ కి కూడా ఈ సినిమా తెలియని వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, గుమ్మడి వంటి హేమాహేమీలు నటించిన భారీ చిత్రం. సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో పాటలు కూడా అంతే బాగుంటాయి. ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల సంగీతం అందించారు. సింగీతం శ్రీనివాసరావు గారు మాయా బజార్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన అప్పుడు సినిమాలో పెడుదాం అనుకోని ఆ తర్వాత సినిమాలోంచి తొలగించిన ఒక పాత గురించి సోషల్ మీడియా లో ఒక వీడియో షేర్ చేశారు.
‘మాయాబజార్’ సినిమాకు మొదట సాలూరి రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.ఆయన ఈ సినిమా కోసం నాలుగు పాటలు స్వరిపరిచారు. ‘శ్రీకరులు దేవతలు’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘నీకోసమే నే జీవించునది’ పాటలను రాజేశ్వరరావు చేశారు.ఐదో పాట కూడా రాజేశ్వరరావు గారు స్వరపరిచారట. ప్రియదర్శిని పెట్టెను శశిరేఖ తీస్తుంటే అభిమన్యుడు కనిపించినప్పుడు వచ్చే పాట అది. గేయ రచయిత పింగళి నాగేంద్రరావు పల్లవి రాశారు. ‘కుశలమా కుశలమా నవ వసంత మధురిమ’ అంటూ సాగే పల్లవికి సాలూరి రాజేశ్వరరావు అద్భుతమైన ట్యూన్ కట్టారు. కానీ, ఆ తరవాత కొన్ని కారణాల వల్ల రాజేశ్వరరావు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఘంటసాల గారిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.
అయితే, ఈ పాటను సినిమాలో వాడుకోలేకపోయామే అని దర్శకుడు కేవీ రెడ్డి.. సింగీతం శ్రీనివాసరావుతో చెప్పి బాధపడేవారట. ప్రస్తుతం లాక్డౌన్లో ఇంట్లో ఖాళీగా ఉన్న సింగీతం గారికి అప్పటి పాట విషయం గుర్తుకు వచ్చింది. ఆ పాటను ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. వెంటనే అప్పటి పల్లవికి కొనసాగింపుగా పాట రాయాలని వెన్నెలకంటిని కోరారట. ఆయన పల్లవితో పాటు రెండు చరణాలు రాశారట. ఈ పాటకు సింగీతం శ్రీనివాసరావు స్వయంగా ట్యూన్ కట్టారు. జైపాల్ సంగీతం సమకూర్చారు. గౌతంరాజు ఎడిటింగ్ చేశారు. తన మనవరాలు అంజనీ నిహిలతో కలిసి సింగీతం ఈ పాటను ఆలపించారు.