కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పురాతన వైభవం తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై 15 రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా షబ్బీర్ అలీ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్ అలీ, అంచలంచెలుగా పైకి ఎదిగారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని కూడా చేపట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తరువాత జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆరేళ్ల పాటు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు.
శాసన మండలి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏఐసీ సీ పెద్దలతో షబ్బీర్ అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి.
కాగా మైనారిటీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న షబ్బీర్ అలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు.