బీజింగ్: కరోనా వైరస్ జన్మ స్థలమైన చైనాలో ఒమిక్రాన్ వైరస్ యొక్క రెండో కేసు నమోదయింది. చైనా కు సంబంధించి 67 ఏళ్ల వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్టు చైనా అధికార మీడియా ఇవాళ తెలిపింది. గత నెల 27వ తేదీన విదేశాల నుంచి గ్వాంగ్జౌ వచ్చిన సదరు వ్యక్తికి తొలుత పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని, రెండు వారాల క్వారంటైన్ అనంతరం పరీక్షలు చేయగా పాజిటివ్గా అతనికి నిర్ధారణ అయిందని తెలిపింది.
ఆ పరీక్షా ఫలితాలను మరింత లోతుగా టెస్ట్ చేయగా అది ఒమిక్రాన్ అని తేలిందని చైనా మీడియా తెలిపింది. ఈ పాటికే డెల్టా ప్రభావంతో వణికిపోతున్న చైనాలో తాజా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడడం అక్కడి అధికార వర్గాలను కలవరపెట్టడం మొదలైంది.
కాగా చైనాలో నిన్న (సోమవారం 13వ తేదీన) తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు బయట పడింది. టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినట్టు అక్కడి అధికారులు తెలిపారు. యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ను గుర్తించినట్లు ప్రకటించింది చైనా మీడియా.
కాగా తొలి కేసుగా నమోదైన ఆ వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తి అనే పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలూ లేవని, ప్రస్తుతం ఆయన్ను ఐసోలేషన్లో ఉంచి పరీక్ష చేస్తున్నామని చైనా అధికారులు తెలిపారు.