fbpx
HomeNationalముంబైలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు, లాక్డౌన్ తప్పదా?

ముంబైలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు, లాక్డౌన్ తప్పదా?

MAHARASHTRA-POSITIVES-RISE-LOCKDOWN-MAY-BE-IMPLEMENTED

ముంబై: దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడుతూ నెమ్మదిగా సాధారణ జన జీవనం మొదలవుతుంటే ఉంది, కానీ దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో మాత్రం కరోనా కేసులు పెరుగుతూ ఇంకా భయపెడుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉందని శివసేన పార్టీ పత్రిక సామ్నా తన ఎడిటోరియల్‌లో పేర్కొంది.

మహరాష్ట్ర రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగుతున్నాయి. జనవరి తర్వాత గత వారంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంతో పోల్చి చూస్తే రెండో వారంలో 14శాతం కేసులు అధికంగా నమోదయ్యాయని తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ముంబై, పుణే నుంచి అత్యధికంగా వస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నాగపూర్, థానె, అమరావతి పట్టణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితికి ఇంకా రెడ్‌ సిగ్నల్‌ పడకపోయినా, ఎల్లో వార్నింగ్‌ అయితే వచ్చింది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రమాద ఘంటికలు మోగడానికి ఎంతో సేపు పట్టదు అని రాష్ట్ర కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు డాక్టర్‌ శశాంక్‌ జోషి వ్యాఖ్యానించారు.

అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఠాక్రే లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌనే మార్గమని హెచ్చరించారు. కరోనా కట్టడికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్‌ చేసుకోవడం వంటివేవీ ప్రజలు చేయడం లేదు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న 15 లక్షల మందికి జరిమానాలు వేయడంతో రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందని ముంబై మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ వెల్లడించారు.

ముంబైలో స్థానిక రైళ్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆంక్షల మధ్య తిరుగుతున్నాయి. మొదటి పదిహేను రోజుల్లోనే ఏకంగా 3 వేల మంది ప్రయాణికులు మాస్కులు లేకుండా తిరగడంతో జరిమానాలు విధించారు. గత వారంలో ముంబైలో రోజుకి సగటున వెయ్యి వరకు కేసులు పెరుగుతున్నాయి.

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలు కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు. విదర్భ, మరఠ్వాడా వంటి ప్రాంతాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. అదే ప్రాంతంలోని అమరావతి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల రేటు 33శాతం పెరిగిందని రాష్ట్ర కోవిడ్‌ బృందం అధికారి డాక్టర్‌ ప్రదీప్‌ అవాతే చెప్పారు. కేవలం 199 మంది మాత్రమే ఉన్న ససుర్వె గ్రామంలో పంచాయతీ ఎన్నికల తర్వాత 62 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular