వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికాలో హెచ్4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ మార్చారు. బైడెన్ ఈ నిర్ణయం వల్ల భారతీయ మహిళలే అధికంగా ప్రయోజనం పొందుతారని అంచనాలు పెరుగుతున్నాయి.
అమెరికాలో పని చేసే ఇతర దేశస్థులు హెచ్–1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములకు (భార్య లేదా భర్త), వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసు) హెచ్4 వీసాలను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) త్వరలో జారీ చేస్తోంది. అమెరికాలో హెచ్–1బీ వీసా కింద పనిచేస్తున్న వారిలో అత్యధిక శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే. ఈ వీసాలతో అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను స్వదేశంలోనే నియమించుకోవచ్చు.
ప్రతిఏటా భారత్, చైనా దేశాల నుంచి వేలాది మంది హెచ్–1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు పొంది పని చేస్తున్నారు. బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో హెచ్–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అనుమతి కార్డులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ మహిళలే కావడం విశేషం.
ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక వలసలపై కఠినంగా వ్యవహరించారు. హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతిని రద్దు చేస్తున్నట్లు 2017లో ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాలను తిరగదోడుతామని ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే.. గడువు ముగిసిన హెచ్4 వీసాదారుల ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) చెల్లుబాటును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.