హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర కానుకను అందించారు. రాష్ట్రంలో అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను పెంచాలని ఆయన నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పని చేస్తున్నా 9,36,976 ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
మంగళవారం ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షతన ఒక కమిటీని కూడా నియమించారు. కొత్త ఏడాదిలో మార్చి నుంచి ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనితో పాటు రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు.