విజయవాడ: ఏపీ విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఇవాళ ఏపీ పీజీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ అయిన కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి కూడా హాజరయ్యారు.
రాష్ట్రంలో ఈ సారే తొలిగా అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే ఒక్క పీజీ సెట్ ను నిర్వహించింది. ఫలితాల విడుదల నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిర్వహణకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించామన్నారు.
కాగా ఆన్లైన్ లోనే నిర్వహించిన ఈ పరీక్ష యొక్క ఫలితాలను కేవలం రెండు వారాలలోనే ప్రకటించామని తెలిపారు. ఈ పీజీ ప్రవేశాలకు 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారని, కాగా ప్రవేశ పరీక్షకి కేవలం 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారు. పీజీ సెట్లో 87.62 శాతం మంది అర్హత సాధించారు.
రాష్ట్రంలో ఇంతవరకు అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులకి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన ఏ యూనివర్సిటీలోనైనా చేరవచ్చు. ఉన్నత విద్యలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ప్రవేశపరీక్షలలో ఎటువంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా కట్డుదిట్టంగా విజయవంతంగా నిర్వహించాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.