విజయవాడ : ఏపీ ఎలెక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీకి శనివారం ఒక లేఖ రాశారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయనను తన నివాసంలోనే పరిమితం చేసేలా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్ఈసీ తన లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు.
ఈ పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మంత్రిని మీడియాతో కూడా మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేశారు. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జత చేశారు. మరోవైపు ఎస్ఈసీ ఉత్తర్వులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు.
ఎస్ఈసీ నుంచి ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామని తెలిపారు. తను రాజకీయాలు మాట్లాడడని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొనని స్పష్టం చేశారు. ఎస్ఈసీ ఆదేశాలు వచ్చిన అనంతరం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.