హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే వర్షం కాస్త తగ్గుముఖం పడుతోంది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు 2 గంటల నుండి ఒక మోస్తరు వర్షం, సాయంత్రం 4 గంటల నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసాయి. కాగా ఈ రోజు రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసి మరియు డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
మరో 12 గంటల పాటు గులాబ్ తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. కరెంట్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
ప్రస్తుతం హైదరాబాద్ అంతా భారీ వర్షం కురుస్తుండడంతో పలు లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు భారీగే చేరింది. ఇంకో అయిదు ఆరు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో నగరంలో చీకటి అలుముకుంది.
ఈ పరిస్థితి నెలకొనండంతో అధికారులు హైదరాబాదీలను అత్యవసరమయితే తప్ప ఇళ్ళా నుండి బయటకు రావొద్దని కోరారు. జీహెచ్ఎంసీ ఇవాళ మరియు రేపు హై అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్లో ఏదైనా అవసరమైతే కంట్రోల్ రూం 040-23202813 నంబర్కు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.