fbpx
Saturday, July 27, 2024
HomeNationalకోవిడ్ తో చెన్నైలో విద్యాసంస్థల మూత దిశగా అడుగులు?

కోవిడ్ తో చెన్నైలో విద్యాసంస్థల మూత దిశగా అడుగులు?

TAMILNADU-SCHOOLS-CLOSED-SOON-AMID-COVID-CASES-SPIKE

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ కలవరం తిరిగి మొదలైందని స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో ఇప్పుడు చికిత్స పొందుతున్నవారి సంఖ్య సుమారు 8వేలకు చేరుకుంటోంది. కాగా 9 జిల్లాలో మరణాలు సైతం నమోదవుతుండడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

అధికంగా చెన్నైలోనే వారంలోపే 5.5శాతం కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియ చేస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రతి వంద కోవిడ్‌ పరీక్షల్లో కనీసం రెండు పాజిటివ్‌ కేసులు వస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాధాకృష్ణన్‌ సోమవారం వెల్లడించడం గమనార్హం.

దేశంలో గత సంవత్సరం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది మార్చిలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత రాష్ట్రంలో 9,10,11,12 తరగతుల కోసం 3 నెలల క్రితమే విద్యాసంస్థలను పున:ప్రారంభించారు. అయితే పాజిటివ్‌ కేసుల రోజురోజుకూ పెరుగుతుండడంతో 9,10,11 తరగతులకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలెట్టారు.

ఆఫ్‌లైన్‌ క్లాసులు కేవలం 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. వీటిని కూడా త్వరలో ఆన్‌లైన్‌కే మార్చేయాలని ఉన్నత విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఆ శాఖ సంచాలకులు వివిధ వర్సిటీల వైస్‌ చాన్సలర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తరగతులు నిర్వహించాలా లేదా విద్యాసంస్థలను మూసివేయాలా అనే విషయంలో ఈ సమావేశంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. అలాగే కరోనా కట్టడిలో భాగంగా ఆలయాల్లో తీర్థప్రసాదాల వితరణ, అర్చనపై నిషేధం విధించారు.

ఇటీవలే చెన్నై లోని పెరుంగుడి మండలంలోని ఒక ఐటీ సంస్థలో 40 మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ క్రమలో ఈ ఐటీ సంస్థకు చెందిన తరమణి, పెరుంగుడి, కందన్‌చావడిల్లో శాఖలను మూసివేయాలని కార్పొరేషన్‌ అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం ముమ్మరం కావడంతో ఉత్తరాది కార్మికులు సొంతూరి బాట పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular