fbpx
HomeTelanganaఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 24 మంది కరోనా పాజిటివ్ ఓటర్లు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 24 మంది కరోనా పాజిటివ్ ఓటర్లు

24-POSITIVE-VOTERS-IN-NIZAMABAD-MLC

నిజామాబాద్‌: తెలంగాణలో ని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ శుక్రవారం జరగనుంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడ్డ వారున్నారు. వీళ్ళంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

పీపీఈ కిట్లను ధరింపజేసి వారిని అంబులెన్స్‌లలో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావాలని నిర్ణయించారు. కరోనా సోకిన ఆ ఓటర్లను సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించాలని భావిస్తున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద వైద్యారోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. ఆ సిబ్బంది పర్యవేక్షణలో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళుతారు.

కరోనా సోకిన ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండొచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. వైరస్‌ బారిన పడి పోలింగ్‌ నాటికి 14 రోజులు పూర్తయితే ఆ ఓటర్లను సాధారణ ఓటర్లుగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పోలింగ్‌ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందికి కూడా పోలింగ్‌కు ఒకరోజు ముందు కరోనా పరీక్షలు చేస్తారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 10 శాతం సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచనున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ అమలు చేస్తున్నామని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్‌ ఉమ్మడి జిల్లాలోని ఏ మున్సిపాలిటీల్లోనూ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా తన పేరు నమోదు చేసుకోకపోవడంతో ఓటు వేసే అవకాశం కోల్పోయారు. అలాగే ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కేఆర్‌ సురేశ్‌రెడ్డికి కూడా ఈసారి ఓటు హక్కు దక్కలేదు. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్‌), వి.సుభాష్‌రెడ్డి (కాంగ్రెస్‌), పి.లక్ష్మినారాయణ (బీజేపీ) బరిలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular