హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. దేశంలో ప్రతి రోజు దాదాపుగా మూడు లక్షలకు పైగా కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నప్పటికీ కేంద్రం ఎటువంటి పటిష్ట చర్యల వైపు దృష్టి సారించినట్లు కనపడడం లేదు.
ఇటీవల ప్రధాని వైరస్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా అది రాష్ట్రాల ఇష్టమని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం కఠిన నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉన్నా అలాంటి ప్రయత్నం చేయడం లేదని సర్వత్రా వినిపిస్తున్న మాట.
కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ప్రధాన అడ్డంకిగా అనిపిస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు. కాబట్టే మే 2వ తేదీ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని సర్వత్రా చర్చ సాగుతోంది.
వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలోనే అప్రమత్తం కావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న ఎన్నికలతో కరోనా కట్టడి చర్యలపై దృష్టి సారించలేదని స్పష్టంగా తెలుస్తోంది. దాని ఫలితం వల్లే కరోనా విస్ఫోటనం జరిగిందని విదేశీ మీడియా నొక్కి చెబుతోంది. కరోనా వ్యాప్తికి ఇటీవల జరిగిన ఎన్నికలే కారణమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు అక్షరసత్యమని మేధావులు చెబుతున్నారు.