ముంబై: సంచలనాలు సృష్టించే రిలయన్స్ జియో మరొక కొత్త సంచలనానికి సిద్దం అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 5జీ మొబైల్స్ అన్నింటికంటే అతి తక్కువ ధరకే 5జీ ఫోన్లను తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా అత్యంత చౌకైన 5జీ ఫోన్ను తీసుకొని రావడానికి ప్రణాళిక రచిస్తోంది.
ఈ నెల 24న జరగబోయే వార్షిక వాటాదారుల సమావేశంలో రిలయన్స్ తమ జియో 5జీ ఫోన్ను లాంచ్ చేయవచ్చని సమాచారం. దీంతో మరింత మంది కొత్త వినియోగదారులకు చేరువ కావాలని చూస్తుంది. రిలయన్స్ తీసుకొని రాబోయే కొత్త 5జీ మొబైల్ ధర కేవలం రూ.2,500-రూ.5,000 మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
దేశంలో ప్రస్తుతం 2జీ ఫోన్ వినియోగదారులని లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త ఫోన్ ను తీసుకురాబోతోంది. సుమారు 20-30 కోట్ల మంది యూజర్లకు చేరువకావడానికి జియో ప్లాన్ సిద్దం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.20,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. మన దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులో లేకున్నప్పటికి 5జీ మొబైల్స్ కొనే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
జూన్ 24న జరిగే సమావేశంలో జియోబుక్ అని పిలవబడే సరసమైన ల్యాప్టాప్ను కూడా తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ ల్యాప్టాప్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీని సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ ల్యాప్టాప్ ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఓఎస్ మీద పనిచేయనుంది. 5జీ నెట్వర్క్కు సంబంధించి కూడా విలువైన సమాచారం పంచుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ 44వ వార్షిక వాటాదారుల సమావేశంలో జియో మరో సంచలనం క్రియేట్ చేయబోతున్నది అని తెలుస్తుంది.