fbpx
Saturday, July 27, 2024
HomeTelanganaమళ్ళీ మేయర్ పదవి టీఆర్ఎస్ వశం

మళ్ళీ మేయర్ పదవి టీఆర్ఎస్ వశం

MAYOR-DEPUTYMAYOR-BOTH-WON-BY-TRS

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్శించింది. కాగా‌ ఎట్టకేలకు ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో చివరికి అధికార పార్టీయే విజయం సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ రెండు‌ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి తమ జెండానే ఎగిరేలా చేసింది.

అందరూ ఊహలను నిజం చేస్తూ మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ పార్టీ విధేయులనే వరించింది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కే కేశవరావు కుమార్తె అయిన గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా, శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు.

విజయలక్ష్మి ఎన్నిక అవడంతో ఆమె ఇంటి దగ్గర కూడా సందడి పెరిగింది. మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి మేయర్‌ పదవి దక్కిన వారిలో ఆమె రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్‌ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసారు

మేయర్‌ పీఠం కోసం తొలినుంచి అధికార టీఆర్‌ఎస్‌లో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సింధు ఆదర్శ్‌రెడ్డి (భారతీనగర్‌)తో పాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి, పీజేఆర​ కుమార్తె విజయారెడ్డి పేర్లు సైతం ప్రముఖంగా వినిపించాయి. అయితే రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ చివరి నిమిషంలో కేకే కుమార్తెను ఖరారు చేశారు.

కాగా విజయారెడ్డి సైతం మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. దీంతో విజయారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మేయర్ ఎన్నిక నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యలో నుంచి వెళ్ళిపోయారు.

కాగా గ్రేటర్‌ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా, టీఆర్ఎస్‌ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతో టీఆర్‌ఎస్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను చేజిక్కించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular