పుణే: సీఎస్కే సారథ్య బాధ్యతలు తిరిగి మళ్ళీ ధోనీ చేతికే వచ్చాయి. కెప్టెన్ మారగానే చెన్నై ఆటతీరులో ఒక్క సారిగా మారిపోయింది. హైదరాబాద్ తో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై మళ్లీ సూపర్ కింగ్స్ లాగ ఫాంలోకి వచ్చింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోని సేన 13 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 202 పరుగుల భారీస్కోరు చేసింది.
చెన్నై బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), కాన్వే (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓపెనింగ్లో చెలరేగి ఆడారు. సెంచరీకి ఒక్క పరుగు తక్కువలో రుతురాజ్ అవుటయ్యాడు. తర్వాత హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (33 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మాత్రమే కాస్త మెరుగైన స్కోరు చేశాడు.
హైదరాబాద్ లక్ష్యాన్ని ధాటిగా ఛేదించేందుకు ప్రయత్నించింది. ఓపెనర్లు విలియమ్సన్ (37 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) దుకుడాగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. దీంతో ఓవర్కు 10 పైచిలుకు పరుగులు వచ్చాయి. అయితే ముకేశ్ ఆరో ఓవర్లో వరుస బంతుల్లో అభిషేక్తో పాటు రాహుల్ త్రిపాఠి (0)ని ఔట్ చేసి దెబ్బ మీద దెబ్బ తీశాడు.
తర్వాత మార్క్రమ్ (17; 2 సిక్సర్లు), విలియమ్సన్ క్రీజులో ఉన్నంత వరకు 11 ఓవర్ల దాకా పటిష్టంగా కనిపించినా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి లక్ష్యానికి దూరమైంది.