fbpx
HomeBusinessరాష్ట్రాలకు కేంద్రం నుండి 20 వేల కోట్ల జీఎస్టీ నిధులు

రాష్ట్రాలకు కేంద్రం నుండి 20 వేల కోట్ల జీఎస్టీ నిధులు

GST-FUNDS-TO-STATES-BY-CENTER

న్యూఢిల్లీ : ఈ ఏడాది కి సంబంధించిన జీఎస్టీ పరిహారం కింద జమ అయిన రూ 20,000 కోట్ల నిధులను సోమవారం రాత్రి రాష్ట్రాలకు బదలాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాలకు తెలిపారు. 42వ జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.

వచ్చే వారంలోపు మిగతా 24,000 కోట్లను ఐజీఎస్టీ కింద చెల్లిస్తామని చెప్పారు. జీఎస్టీ సెస్‌ను ఐదేళ్ల పాటు విధించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరగా మరికొంత కాలం పరిహార సెస్‌ వసూలును పొడిగిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ముఖ్యంగా జీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్స్‌పై సమావేశంలో ముందుగా చర్చించారు. పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని, పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రాన్ని కోరారు. ఐజీఎస్టీ కింద‌ రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలనే డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముందుంచారు.

ఈ సమావేశంలో జీఎస్టీ పరిహారం చెల్లింపుపై ఎటూ తేల్చకపోవడంతో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇక కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వెంటాడటంతో రుణ అవకాశాలను తోసిపుచ్చుతూ జీఎస్టీ పరిహారంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

మరోవైపు కోవిడ్‌ 19 సమస్యలు, జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లిన 2.35 లక్షల కోట్ల ఆదాయ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ వద్ద రుణం తీసుకోవడంతో పాటు మార్కెట్‌ నుంచి రుణాలను సమీకరించుకోవాలని గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో కేంద్రం సూచించింది. రుణ అవకాశాలను తోసిపుచ్చిన రాష్ట్రాలు కేంద్రం చెల్లించాల్సిన రూ 97,000 కోట్ల జీఎస్టీ పరిహారంపై పట్టుబడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular