కటక్: భారత్ కు వరుసగా రెండో ఓటమి! దక్షిణాఫ్రికాతో సిరీస్కు ముందు వరుసగా 12 టి20 మ్యాచ్చుల్ని గెలిచిన టీమిండియా ఇప్పుడు సఫారీల ముందు నిలువలేకపోతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పవర్కు తొలి టి20 మ్యాచ్ను సమర్పించుకున్న భారత్ ఇప్పుడు 2వ టి20లో సఫారీ బౌలింగ్ దెబ్బకు కుదేలయింది.
ఆదివారం జరిగిన 2వ టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. కాగా ఇక సిరీస్ను గెలవాలంటే మాత్రం భారత్ మిగతా మూడు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ మ్యాచ్ లో కూడా టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేయవలసి రావడం, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. మిగతా వారిలో తొలుత ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు.
కాగా భారత్ నిలిపిన లక్ష్యం చిన్నదే అయినప్పటికీ సీనియర్ సీమర్ భువనేశ్వర్ తన వైవిధ్యమైన బంతులతో తన ప్రతీ ఓవర్లోనూ ఒక వికెట్ తీయడం భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. ఓపెనర్ హెండ్రిక్స్ (4), టాపార్డర్ బ్యాట్స్ర్లు ప్రిటోరియస్ (4), డసెన్ (1)లను భువీ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 29 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో కెప్టెన్ బవుమా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన క్లాసెన్ నాలుగో వికెట్కు 64 పరుగులు, తర్వాత మిల్లర్ (15 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో ఐదో వికెట్కు 51 పరుగులు జోడించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లపై క్లాసెన్ చెలరేగిపోయాడు. గెలుపు ముంగిట క్లాసెన్, పార్నెల్ అవుటైనప్పటికీ డేవిడ్ మిల్లర్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు.