న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించింది. రష్యా చర్యలను ఖండిస్తూ భద్రతా మండలిలో ఓటింగ్ ను నిర్వహించింది.
ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడిని వ్యతిరేకిస్తూ అమెరికా చేసిన ఈ ప్రతిపాదనపై భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉండగా అందులో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తమ ఓటు వేశాయి. అయితే మొదటి నుంచి ఉక్రెయిన్-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్కు దూరంగా నిలిచాయి.
ఇదిలా ఉండగా భద్రతా మండలిలో ఉన్న అయిదు శాశ్వత దేశాల్లో ఒక దేశమైన రష్యా, తన విటో అధికారాన్ని ఉపయోగించి ఈ తీర్మాణాన్ని వీగిపోయేలా చేసింది. కాగా ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్న నేపథ్యంలో ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అన్ని సభ్య దేశాలు చర్చలు జరపాలని భద్రతా మండలికి సూచించారు.
ఉక్రెయిన్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతోందని ఆయన మందలిలో తెలిపారు. ఉక్రెయిన్ లో జరుగుతున్న ఈ హింసను తక్షణమే ఆపేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని మేము కోరుతున్నామని అన్నారు. మానవాళి ప్రాణాలను పణంగాపెట్టడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని ఆయన వ్యాఖ్యానించారు.