న్యూయార్క్: యూనైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (ఐక్యరాజ్య సమితి) పై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. యూఎన్వో కి సంబంధించిన సర్వర్ల రక్షణ వ్యవస్థలను హ్యకర్లు చేధించినట్లు సమాచారం. ఈ సర్వర్లలో ఉండే పలు దేశాల మధ్య జరిగిన చర్చల వివరాలు మరియు పలు లావాదేవీలకు సంబంధించిన కీలకమైన సమాచారం హ్యాకింగ్ కు గురైనట్లు తెలుస్తోంది.
ఐక్యరాజ్య సమితి యొక్క పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని కొందరు గుర్తు తెలియని హ్యాకర్లు వాటిని హ్యక్ చేశారని యూఎన్ సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్ ధృవీకరించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో హ్యకింగ్ జరిగినట్టు గుర్తించామని, దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
అన్ని దేశాలకు సంబంధించిన కీలకమైన సమాచారం ఐక్యరాజ్య సమితి యొక్క సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఎంతో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఉపయోగించే సర్వర్లను ఈ హ్యకర్లు ఎలా ఛేధించారనే విషయంపై విచారణ కొనసాగుతోంది. యూన్కి సంబంధించిన ప్రొప్రైటరీ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఉద్యోగి యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆధారంగా హ్యకర్లు యూఎన్ సిస్టమ్స్తో అనుసంధానమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు.
కాగా ఈ సిస్టమ్స్తో యాక్సెస్ సాధించిన హ్యకర్లు ఏప్రిల్ 5 నుంచి ఆగస్టు 7 వరకు వరుసగా చొరబడినట్టు గుర్తించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా హ్యాకర్లు ఏ సమాచారాన్ని తస్కరించారు, అందులో భద్రతాపరంగా కీలకమైన సమాచారం ఏదైనా ఉందా అనే అంశాలను గుర్తించే పనిలో యూఎన్ భద్రతా సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.