కీవ్: ఉక్రెయిన్లో రష్యా బలగాలకు మర్యిఉ ఉక్రెయిన్ దేశ సైనికులకు మధ్య భయంకరమైన పోరు ఇంకా నడుస్తోంది. ఆయుధ సంపత్తి ఎక్కువగా ఉండి, అత్యాధునిక టెక్నాలజీ ఆయుధాలు కలిగినప్పటికీ రష్యాకు ఉక్రెయిన్పై దాడి పెద్ద మొత్తంలో నష్టాన్నే మిగిల్చినట్టు తెలుస్తోంది.
మూడు రోజులుగా జరుగుతున్న ఈ యుద్దంలో ఉక్రెయిన్ సైన్యం తగ్గేదేలే అంటూ తమ శక్తి సామర్థ్యాలకు మించి యుద్ధం చేస్తోంది. రష్యా దళాలకు ఉక్రెయిన్ సైన్యం చాలా ధీటుగా సమాధానం ఇస్తున్నట్లు పశ్చిమ దేశాలు తెలిపాయి.
కాగా ఈ పోరు లో ఇప్పటి వరకు దాదాపు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తన ఫేస్బుక్ ఖాతాలో ప్రకటించింది. అదనంగా మరో 200 మందికి పైగా రష్యా సైనికులను అరెస్టు కూడా చేసినట్లు చాలా గర్వంగా వెల్లడించింది. అలాగే రష్యాకు చెందిన 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్లను, 536 ఆర్మీ వాహనాలను కూడా నాశనం చేసినట్టు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
అయితే రష్యా మాత్రం తమ సైనికుల మృతులకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు వెల్లడించలేదు. రష్యా బలగాలకు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు ఆ దేశ బలగాలు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నాయి.