న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇవాళ విమాన ప్రయాణికులకు ఒక శుభవార్త తెలిపింది. ఇప్పటి వరకు విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక సర్క్యూలర్ని కూడా జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబరు 18 నుంచి దేశీయంగా విమాణ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి.
కరోనా మహమ్మారి రెండవ వేవ్ విజృంభనతో భారత్ లో విమాన సర్వీసులపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. విమానాలలో ప్రయాణించాలంటే కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్, ముఖానికి మాస్క్ ఇలా తదితర రక్షణ చర్యలను కట్టుదిట్టం చేసింది. అలాగే సామాజిక దురం కూడా పాటించే లక్ష్యంతో విమానంలో ప్రయాణికుల పరిమితిపై కూడా ఆంక్షలు విధించారు. మే 21వ తేది నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉన్నాయి.
కాగా తాజాగా దేశంలో కోవిడ్ తగ్గుముఖం పడుతుంటంతో క్రమంగా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తి వేస్తూ వస్తున్నారు. చివరి సారిగా విమాన ప్రయాణాలపై సెప్టెంబరు 18 మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. వాటి ప్రకారం 85% సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులకు అనుమతిస్తున్నారు. తాజాగా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇకపై విమానాలు వంద శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
సవరించిన ఈ వెసులుబాటుతో అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఫ్టైట్ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో టిక్కెట్లు విక్రయించడం లేదు. దీంతో సమయానికి టిక్కెట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక ప్రయాణీకులకు ఈ సమస్య తీరనుంది.