హైదరాబాద్ : ఆశావాది ప్రతి సమస్యలోనూ ఒక మంచి అవకాశాన్ని వెతుకుతాడు అని నానుడి. అయితే ఇది ఇప్పుడు కరోనా సంక్షొభంలో బాగా రుజువు అవుతోంది. దొరికినోడు దొరికినింత దోచుకోవడం ఇప్పుడు బాగా అలవాటయ్యింది కొందరికి.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పలుచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు బ్లాక్లో దొరుకుతున్నాయి. హైదరాబాద్ నుంచే కొన్ని కంపెనీల డీలర్ల ద్వారా క్లినిక్లకు, ల్యాబ్లకు, చివరకు వ్యక్తి గతంగా కూడా కొందరి చేతుల్లోకి చేరుతున్నాయి. వీటిని ‘బ్లాక్’ చేస్తూ, వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నారు కొందరు ఘనులు.
ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది భయపడుతుండటం, ఒకవేళ చేయించుకున్నా ట్రేసింగ్, వైద్య సిబ్బంది హడావుడితో నలుగురికి తెలిస్తే బాగుండదన్న భావనతో చాలామంది యాంటిజెన్ టెస్టులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కిట్లకు డిమాండ్ పెరిగి బ్లాక్ అవుతున్నాయి. ఇది జిల్లా వైద్యాధికారుల దృష్టికొచ్చినా పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి.
తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులకు, లేబొరేటరీలకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కేవలం ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసేందుకే 23 ప్రైవేట్ లేబొరేటరీలకు, కొన్ని ఆసుపత్రులకు అనుమతి ఉంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 చోట్ల ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు.
అయితే ఈ పరీక్ష ఫలితాల వెల్లడికి ఒక్కోసారి వారం వరకు సమయం పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, లేబొరేటరీలకు కేంద్రం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు అనుమతినిచ్చింది. దీనిద్వారా కరోనా నిర్ధారణ అరగంటలోపే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి వరకు వందలాది కేంద్రాల్లో ప్రభుత్వమే యాంటిజెన్ టెస్టులు చేస్తోంది.
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లో శాంపిళ్ల సేకరణ చాలా కీలకం. గొంతు/ముక్కులోంచి స్వాబ్ నమూనా సరిగా తీయకుంటే ఫలితం తారుమారవుతుంది అని నిపుణులు తెలుపుతున్నారు. శిక్షణ కలిగిన టెక్నీషియన్లు మాత్రమే స్వాబ్ నమూనాలు తీయాలి. తీసిన శాంపిళ్లను గంటలోపే పరీక్షించాలి. లేదంటే ఆ శాంపిల్ పనికిరాదు.
కొందరైతే ఇళ్లలో తామే స్వాబ్ తీసుకొని పరీక్షించుకుంటున్నారు. ఇదింకా ప్రమాదకరం. దీనివల్ల ఫలితం తారుమారయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇక యాంటిజెన్ టెస్ట్కు ఉన్న ప్రధాన లోపం నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం 50 నుంచి 70 శాతమే. పాజిటివ్కు మాత్రమే కచ్చితత్వం ఉంటుంది.