పహల్గామ్: ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం విరుచుకుపడింది. తెల్లవారుజామున పాక్ ప్రధాన భూభాగం, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను క్షిపణులతో ధ్వంసం చేసింది.
జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలు లక్ష్యంగా మారాయి. భారత్ దాడులకు పాక్ నుండి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు, ఇది ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన షెడ్యూల్లో పెద్ద మార్పు చేశారు. నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్కి జరగాల్సిన మూడు దేశాల పర్యటనను వాయిదా వేశారు. ప్రస్తుత సున్నిత పరిస్థితులలో ప్రధాని దేశంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యటనలు మళ్లీ ఎప్పుడు జరుగుతాయో త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
మోదీ ఇప్పటికే కేంద్ర కేబినెట్ తో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. భద్రతా పరిస్థితులను సమీక్షించి, తదుపరి చర్యలపై చర్చిస్తున్నారని సమాచారం. ఈ సమావేశం తర్వాత కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ పై ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రజలు, నేతలు ప్రధాని తీసుకునే తదుపరి నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.