మాస్కో: రష్యా కొనసాగిస్తున్న సైనిక దాడుల వల్ల ఉక్రెయిన్లో నరమేధం జరుగుతోంది. రష్యా బలగాలు బాంబులు, మిస్సెల్స్తో ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నారు. యుద్ధం మొదలైన రెండో రోజే ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ను రష్యా బలగాలు చుట్టుముట్టేశాయి.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా యొక్క విదేశాంగ మంత్రి ఒక కీలక ప్రకటన చేశారు. ఒక వేళ ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపితే తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాల్ని వదలి లొంగిపోవాలని, అప్పుడే వారితో చర్చలు ముందుకెళ్తాయని ఆ ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ వెల్లడించారు.
కాగా రష్యా విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన తరువాత తాము కూడా చర్చలు జరిపేందుకు సిద్దంగానే ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపేయాలని జిన్పింగ్ పుతిన్ ను కోరినట్టు సమాచారం. ఉక్రెయిన్తో చర్చలు జరపాలని పుతిన్ను జిన్పింగ్ కోరినట్లు అలగే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.