విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో ఇవాళా మరో అల్పపీడనం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడనుందని రాష్ట్ర వాతావరణ కేంద్రం సమాచారం తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా విశాఖ, తూ.గో.జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో గులాబ్ తుపాను ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల మంగళవారం కూడా భారీగా వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మి.మీ. వర్షపాతం నమోదయిందని తెలిపింది వాతావరణ కేంద్రం.