fbpx
Tuesday, April 23, 2024
HomeTop Storiesమానవ సంబంధాలను హరిస్తున్న కరోనా

మానవ సంబంధాలను హరిస్తున్న కరోనా

HUSBAND-LEAVES-CORONA-POSITIVE-WIFE

బెంగళూరు: పెళ్ళి చేసుకున్న సమయంలో ధర్మార్థ కామ మోక్షాలతో తోడునీడగా ఉంటానని అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త, భార్యకు చిన్న కష్టం రాగానే పారిపోయాడు. ఆ అభాగ్యురాలు వైద్య సహాయమందక మరణించగా చివరి చూపుకు కూడా భర్త రాలే­దు. కరోనాపై ఉన్న అపో­హలు, భయాలు మానవ సంబంధాలను ఛిద్రం చేస్తున్నాయనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఎక్కడో మారుమూలన కాదు, ఐటీ సిటీ బెంగళూరులోనే ఈ ఘోరం జరిగింది.

బెంగళూరులో జేపీ నగర, శంకరమఠ వార్డులో గౌరి (27), మంజునాథ్‌ దంపతులు నివసిస్తున్నారు. రెండేళ్ల కిందట వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చి అద్దె ఇంట్లో జీవిస్తున్నారు. భార్య ఒక షాపింగ్‌ మాల్‌లో సేల్స్‌ ఉమెన్‌గా, భర్త మరోచోట డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

పోయిన బుధవారం ఆమెకు జ్వరం రాగా, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని వచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో భర్త మరుక్షణమే భార్యను వదిలిపెట్టి పరారయ్యాదు. ఆమెకు శ్వాసకోశ సమస్య పెరగగా, ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె శుక్రవారం ఇంట్లోనే మృతిచెందింది.

శనివారం ఇంటి యజమాని గమనించిన తరువాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని, స్థానిక కార్పొరేటర్‌ శివరాజ్‌లు పలుమార్లు మంజునాథ్‌కు ఫోన్‌ చేసినప్పటికీ తను స్పందించలేదు. చివరికి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. ఇక మృతురాలి బంధువులకు ఫోన్‌ చేసి చెప్పగా, ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లినరోజు నుంచే సంబంధం తెగిపోయిందని చెప్పేశారు. చివరకు కార్పొరేటర్‌ తదితరులే కార్పొరేషన్‌ అంబులెన్స్‌ను రప్పించి అంత్యక్రియలు జరిపించారు. భర్తపై శంకరమఠ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular