న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా సహాయాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు ఇవాళ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ ఎక్స్గ్రేషియా మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(రాష్ట్రాల విపత్తు సహాయ నిధి) ద్వారా ఇవ్వనున్నామని తెలిపింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ఇవ్వనుందని సమాచారం. దీనికి సంబంధించి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు దేశంలో 4.45 లక్షలమంది మహమ్మారి బారిన పడి చనిపోయారు.
కాగా ఇది వరకే మరణించిన వారితోపాటు రానున్న భవిష్యత్తులో కరోనా వల్ల ప్రాణాలు విడిచిన వారందరికి కూడా ఈ ఎక్స్ గ్రేషియా వర్తిస్తుందని పేర్కొంది. ఈ విషయమై సదరు వ్యక్తి కోవిడ్ వల్ల మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే బిహార్ లో కోవిడ్తో మరణించిన వారికి 2 లక్షలు, మధ్యప్రదేశ్ లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాయి.