న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గ్రూప్ సీ లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు గ్రూపు ‘బి’లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు దీపావళి పండుగ ముందు పెద్ద శుభవార్త అందించింది. రాబోయే దీపావళి పండగ సీజన్ లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.
2020-21 సంవత్సరానికి ఉద్యోగులకు 30 రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ను గ్రూప్ ‘సీ’లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే గ్రూపు’బి’లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరు ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీం కింద కవర్ కారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, “ఈ తాత్కాలిక బోనస్ సెంట్రల్ పారా మిలటరీ దళాలు, సాయుధ దళాలలో అర్హులైన ఉద్యోగులకు కూడా లభిస్తుందని తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన ఉద్యోగులకు కూడా ఈ బోనస్ లభిస్తుంది. ఇతర బోనస్ లేదా ఎక్స్ గ్రేషియా దీని కింద కవర్ చేయబడదు” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ(డిఓఈ) ఈ రోజు(అక్టోబర్ 18) ఆఫీస్ మెమోరాండంలో తెలిపింది.
కాగా 31-3-2021 నాటికి సర్వీసులో ఉండి పని చేస్తున్న వారికి 2020-21 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సేవ చేసిన ఉద్యోగులకు మాత్రమే ఈ అడ్ హాక్ బోనస్ చెల్లింపుకు అర్హులని ప్రభుత్వం తెలిపింది.