చిత్తూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం తరఫున ఆంధ్రప్రదేశ్లో భారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి జపాన్ ముందుకొచ్చింది. జపాన్ కి చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ వారి అనుబంధ సంస్థ అయిన డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్ కండిషనింగ్, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని చిత్తూరు జిల్లా పారిశ్రామికవాడ అయిన శ్రీసిటీలో 75.5 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ను త్వరలో ఏర్పాటు చేయనుంది. శ్రీసిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వల్జీత్ జావాతోపాటు శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఒప్పంద పత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు.
శ్రీసిటీలో డైకిన్ పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంటున్న పరిశ్రమ ప్రతినిధులు మూడువేల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపింది. ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి కూడా లభిస్తుందని, 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు డైకిన్ ప్రతినిధుల బృందం తెలిపింది.
భారత దేశ మార్కెట్లో అపారమైన అవకాశాలుండడం వల్ల ఇక్కడి మార్కెట్పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కన్వల్జీత్ జావా తెలిపారు. ఇప్పటికీ 5–6 శాతం మంది మాత్రమే ఏసీ వినియోగిస్తుండడంవల్ల ఈ రంగం వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయని ఆయన ఆన్నారు. తక్కువ వ్యయంతో అత్యుత్తమ ఉత్పత్తుల కోసం దేశ ప్రజలు చూస్తున్నారని, ఆ దిశగా తాము కృషిచేస్తామని, ఇందుకోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు.