హైదరాబాద్: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర క్యాబినెట్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్, “కుల గణనపై రాహుల్ గాంధీ ఆలోచనలు నెరవేరుతున్నాయి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కేంద్ర విధానాలపై ప్రభావం చూపగలిగారు,” అని అన్నారు. తెలంగాణలో మొదటిసారి కుల గణనను ప్రారంభించడం రాహుల్ దార్శనికతకే ఉదాహరణగా నిలుస్తుందని వివరించారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దీనిపై పోరాటం చేశిందని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని పేర్కొన్నారు. “తెలంగాణ చేసింది, దేశం అనుసరిస్తోంది” అనే మాట ఇప్పుడు నిజమవుతోందని వ్యాఖ్యానించారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా కేంద్ర నిర్ణయాన్ని అభినందించారు. సాధారణ జన గణనతోపాటు కులాల గణాంకాల సేకరణను హర్షణీయమైన దిశగా అభివర్ణించారు.
ప్రజల ఒత్తిడి, రాష్ట్రాల నడిపించిన ఉద్యమాల వలన కేంద్రం చివరికి కుల గణనకు ఒప్పుకుందని గౌడ్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఆలోచనల స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా సమానత్వం కోసం ఇది ముందడుగవుతుందని తెలిపారు.