fbpx
HomeTelanganaజీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే: ఎస్ఈసీ

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే: ఎస్ఈసీ

BALLOT-SYSTEM-IN-GHMC-ELECTIONS

హైదరాబాద్‌ : కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సహా ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలకు అన్నింటికీ బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పేపర్లతోనే ఎన్నికలు‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉన్న సమయం, వివిధ అంశాలపై రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఇతరత్రా విషయాలపై సవివరంగా చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిం చింది.

మునిసిపల్ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్స్‌లు, పత్రాలు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలు, ఎస్‌ఈసీ వద్ద రిజిస్టర్‌ అయి రిజర్వ్‌ సింబల్స్‌ పొందిన 39 రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరినట్లు కమీషన్ తెలిపింది. దీనిపై స్పందించిన 8 గుర్తింపు పొందిన పార్టీల్లో ఐదు బ్యాలెట్‌ బాక్స్‌ వైపే మొగ్గుచూపగా ఒక పార్టీ ఈవీఎం ద్వారా ఎన్నికలకు మొగ్గుచూపింది.

18 రిజిస్టర్డ్‌ పార్టీల్లో 11 పార్టీలు బ్యాలెట్‌ బాక్స్‌ల ద్వారానే ఎన్నికలు జరపాలని కోరగా, రెండు పార్టీలు ఈవీఎంల వైపు మొగ్గుచూపాయని తెలిపింది. మిగతా 7 పార్టీలు ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని ఎస్‌ఈసీ పేర్కొంది. ఈవీఎంలకు వీవీప్యాట్‌ మెషీన్లను అనుసంధానించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో తమ వద్ద వీవీప్యాట్‌లు అందుబాటులో లేకపోవడంతో వాటి కోసం హైదరాబాద్‌ ఈసీఐఎల్, బెంగళూరు బీఈఎల్‌ల నుంచి కొటేషన్లు కోరామని ఎస్‌ఈసీ వివరించింది.

మూసి ఉంచిన గదుల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను శుభ్రం చేయడం, కట్టి ఉంచిన మిషన్లను తెరవడం, మళ్లీ ప్యాక్‌ చేయడం వంటి పనుల్లో భారీగా సిబ్బందిని నియమించాల్సి వస్తుందని తెలియజేసింది. ఈ విధంగా ‘హైరిస్క్‌ కమ్యూనిటీ’గా ఉన్న వారిని భాగస్వాములను చేయడం ద్వారా ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తికి అధిక అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular